చావుతప్పినవాడు … థియొడోర్ రెట్కీ, అమెరికను కవి
ఈ కవిత ప్రస్తుతం అన్ని సమాజంఅలలోనూ ఉన్న విద్యావ్యవస్థలమీద నిశితమైన వ్యాఖ్యగా నేను భావిస్తున్నాను. విద్యాలయాలలో బోధిస్తున్న విషయాలు మనిషినీ- మృగాన్నీ; వెలుగునీ-చీకటినీ, ప్రేమనీ- ద్వేషాన్నీ, వేరుచేసి చూడలేని అశక్తతను కలిగిస్తున్నాయి. మన ఆలోచనలకు రూపాన్నిచ్చే పదాలు, వాటి భావచిత్రాలు, కేవలం శుష్కమైన పర్యాయపదాల్లో ఇమిడిపోతున్నాయి తప్ప, సారూప్యంగా ఉన్న విరుద్ధవిషయాలను విశ్లేషించి వేరుచేయగల సమర్థతను అందించలేకున్నాయి. ఈ చదువు ఒకరకంగా గొర్రెపిల్లను వేటకు తీసుకెళుతున్న చందాన ఉంది. ఆ ఉరికంబంనుండి ఏ కొద్దిమందో మాత్రమే బయటపడగలుగుతున్నారు.
***
నా వయసు ఇరవై నాలుగు
నన్ను వధ్యశిలకు తీసుకుపోయినా
ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాను.
ఈ క్రింది శుష్కపదాలన్నీ సమానార్థకాలు:
మనిషీ- మృగమూ
ప్రేమా- ద్వేషం
మిత్రుడూ- శత్రువూ
చీకటీ – వెలుగూ
మనిషినీ మృగాన్నీ చంపే తీరు ఒక్కటే
నేను కళ్ళారా చూసేను:
లారీలనిండా ముక్కలుగా నరికిన
దిక్కులేని మనుషుల శవాల్ని.
ఆలోచనలకేముంది, అవి వట్టి మాటలు:
సద్వర్తన – నేరప్రవృత్తి
నిజాలు- అబద్ధాలు
రూపం – కురూపం
సాహసం- పిరికిదనం.
సద్గుణానికీ నేరప్రవృత్తికీ ఇచ్చే విలువ ఒక్కటే:
నేను కళ్ళారా చూసేను:
ఒకమనిషి ఎంత సుగుణాలపుట్టో
అతనంత నేరప్రవృత్తిగలవాడు.
నేను ఒక దేశికునికోసం, గురువుకోసం వెతుకుతున్నాను
అతను నా దృశ్య, శబ్ద, వాక్ శక్తులని పునరుద్ధరించగలడనీ
అతను తిరిగి వస్తువులకీ, ఆలోచనలకీ సరియైన పేర్లివ్వగలడనీ
అతను చీకటినీ, వెలుగునీ వేరుచేసి చూపించగలడనీ.
నా వయసు ఇరవై నాలుగు ఏళ్ళు
నేను ఉరికంబందాకా వెళ్ళి
బతికి బట్టకట్టినవాణ్ణి.
.
థియొడోర్ రెట్కీ
(May 25, 1908 – August 1, 1963)
అమెరికను కవి.
.
